Monday, July 19, 2010

విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీ కృష్ణదేవ రాయలు


శ్రీ కృష్ణదేవ రాయలు (పా.1509-1529) అత్యంత ప్రసిద్ధవిజయనగర సామ్రాజ్య చక్రవర్తి. ఈయన పాలనలో సామ్రాజ్యము అత్యున్నతస్థితికి చేరుకున్నది. కృష్ణరాయలను తెలుగు మరియు కన్నడ ప్రజలు భారతదేశాన్ని పాలించిన గొప్ప చక్రవర్తులలో ఒకడిగా అభిమానిస్తారు. సాహిత్యములో ఈయన ఆంధ్ర భోజుని గా మరియు కన్నడ రాజ్య రమారమణ గా కీర్తించబడినాడు. 
ఈయన పాలనను గురించిన సమాచారము పోర్చుగీసు సందర్శకులు డొమింగో పేస్ మరియు న్యూనిజ్ ల రచనల వలన తెలియుచున్నది. రాయలకు ప్రధాన మంత్రి తిమ్మరుసు. శ్రీకృష్ణదేవరాయలు సింహాసనం అధిష్ఠించడానికి కూడా తిమ్మరుసు చాలా దోహదపదడినాడు. కృష్ణరాయలు తిమ్మరుసును పితృసమానునిగా గౌరవించేవాడు.
కృష్ణదేవ రాయలు, తుళువ నరస నాయకుడు, నాగలాంబల (తెలుగు ఆడపడుచు) కుమారుడు.[1] ఇతను ఇరవై సంవత్సరాల వయసులో ఫిబ్రవరి 4, 1509న విజయనగర రత్నసింహాసనాన్ని అధిష్ఠించినాడు. ఇతని పట్టాభిషేకానికి అడ్డురానున్న అచ్యుత రాయలు నూ, వీర నరసింహ రాయలునూ, అనుచరులనూ తిమ్మరుసు సుదూరంలో ఉన్న దుర్గములలో బంధించినాడు.
రాజ్యం అధిష్ఠానం ఇతను రాజ్యం అధిష్ఠించునాటికి రాజ్యమంతా చాలా గందరగోళంగా ఉన్నది. దక్షిణాన సామంతులు స్వతంత్రులు అయినారు, తీరాంధ్ర ప్రాంతాన్ని గజపతులు ఆక్రమించుకొని తమ రాజ్యంలో కలుపుకొని, కొండవీడు, ఉదయగిరి వంటి పటిష్ఠమైన దుర్గములతో బ్రహ్మాండమైన రక్షణ ఏర్పాట్లు చేసుకున్నారు. బహమనీ సుల్తానులు రాజ్యంలోనికి రోజురోజుకూ చొచ్చుకొని రాసాగినారు. ఇటువంటి అస్తవ్యస్త పరిస్థితులలో శ్రీకృష్ణదేవరాయలు రాజ్యానికి వచ్చినాడు.
దక్షిణ దేశ దండయాత్ర
ఇతను 1509లో సింహాసనం అధిష్ఠించి, 1512 వరకూ మూడు సంవత్సరములు సైనిక సంపత్తిని పెంపొందించుకొని తొలిసారిగా దక్షిణ దేశ దిగ్విజయ యాత్రకు బయలుదేరినాడు.కావేరీ నదీ తీరంలోని శివపట్టణ పాలకుడు, విజయనగర సామంతుడైన గంగరాజు, విజయనగర రాజుల అలసత్వాన్ని ఆధారంగా చేసుకొని కప్పం చెల్లించక స్వతంత్రముగా ఉండసాగినాడు. ఇతని శత్రువు శ్రీ రంగపట్టణ రాజు చిక్క రాయలు. చిక్క రాయలు శ్రీకృష్ణదేవరాయల సైన్యంలో చేరి గంగరాజుపై యుద్ధం చేసి గెలిచినాడు. గంగరాజు కావేరి నదిలో పడి ప్రాణాలు వదిలినాడు.తరువాత ఉమ్మత్తూరు, కర్ణాటక, మైసూరు ప్రాంతములను చేజిక్కించుకొని చిక్క రాయలును వాటికి సామంతుని గా చేసినాడు. తరువాత చిన్న చిన్న పాలెగాండ్లను జయించి ఆ ప్రాంతములకు కెంపెగౌడ, వీర గౌడలను పాలకులుగా నియమించినాడు. (ఈ కెంపేగౌడ, వీర గౌడలే బెంగళూరు నిర్మాతలు). తరువాత మలయాళ ప్రాంతములను జయించి, వారినుండి కప్పములను వసూలు చేసినాడు. విజయప్ప, వేంకటప్ప నాయకులను పాండ్యదేశమునకు, దాని పరిసరాలకూ సామంతులుగా నియమించినాడు. విజయప్పనాయుడు, వెంకటప్ప నాయుడుతో కలసి రాయలువారి ఆదేశముపై చిత్తూరు, జింజి, తొండ మండలము, మధుర, తిరునగరు, తిరుచినాపల్లి మొదలగు ప్రాంతములను జయించినాడు. వీరందరి నుండి ఎంతో కప్పమును వసూలు చేసినాడు. ఒక్క జింజి నగరమునుండే సంవత్సరమునకు మూడు కోట్ల రూపాయల విలువైన కప్పం వచ్చేది. దీనితో దక్షిణ దేశమంతా రాయలు స్వాధీనమైనది.

పరిపాలనా సౌలభ్యం కోసం దీని మూడు భాగములుగా విభజించి నాడు
జింజి కేంద్రముగా కృష్ణప్ప నాయకుడు అధిపతిగా నెల్లూరు మొదలగు ప్రాంతములు ఉండెను.

తంజావూరు కేంద్రముగా విజయ రాఘవ నాయకుడు అధిపతిగా కావేరీ నదీ తీరప్రాంతములు రెండవ కేంద్రము.

కొడగు కేంద్రముగా వెంకటప్ప నాయకుడు అధిపతిగా మళయాళ ప్రాంతము మూడవ భాగము.
ఈ దక్షిణదేశ దండయాత్ర తరువాత రాయలు రాజధానికి తిరిగి వచ్చాడు.
తూర్పు దిగ్విజయ యాత్ర
తిమ్మరుసు నాయకత్వంలో చక్కని సైన్యమును తూర్పు దిగ్విజయ యాత్రకు పంపించినాడు.
సైనిక విశేషములు
తిమ్మరుసు సైన్యమును చక్కగా వ్యూహాత్మకంగా విభజించినాడు. మొత్తం సైన్యాన్ని ఏడు భాగములుగా విభజించినాడు. ఒక్కొక్క విభాగములోను కింది దళాలు ఉన్నాయి:
• 30,000 కాల్బలము
• నాలుగు వేల అశ్విక దళము
• రెండువందల ఏనుగులు
ఈ విభాగాలకు అధ్యక్షులుగా కింది వారిని నియమించాడు.
1. రాయసము కొండమరుసు
2. పెమ్మసాని రామలింగ నాయుడు
3. గండికోట కుమార తిమ్మానాయుడు
4. వెలుగోడు గంగాధరరెడ్డి
5. అకినీడు ఇమ్మరాజు
6. ఆరవీటి నారపరాజు
7. ఆరవీటి శ్రీరంగరాజు
ఉదయగిరి విజయం
ఈ తూర్పు దిగ్విజయ యాత్రలో భాగంగా 1513లో ఉదయగిరి ని ముట్టడించినాడు. రాయసము కొండమరుసు విజయనగర సేనలకు ఆధిపత్యము వహించి సంవత్సరమున్నర పాటు తీవ్రమైన పోరాటము చేసి దుర్గమును స్వాధీనము చేసుకున్నాడు. తరువాత ఉదయగిరి ప్రాంత రాజప్రతినిధిగా అతడే నియమితుడయ్యాడు. కొండవీడు విజయం
1515లో రాయలు కొండవీడు ను ముట్టడించినాడు. కొండవీడు 1454నుండి గజపతుల ఆధీనంలో ఉన్నది. ఇదే సమయంలో ప్రతాపరుద్ర గజపతి కృష్ణానది ఉత్తర భాగమున పెద్ద సైన్యంతో విడిదిచేసెను. ఈ యుద్ధమున రాయలు విజయం సాధించాడు. తరువాత రాయలు కొండవీడును అరవై రోజులు పోరాడి 1515 జూన్ 6 న స్వాధీనం చేసుకున్నాడు.
తిమ్మరుసు మేనల్లుడు నాదెండ్ల గోపన దుర్గాధిపతిగా నియమితుడయినాడు.
కొండవీడు తరువాత శ్రీకృష్ణదేవరాయల దిగ్విజయ యాత్ర ఇలా సాగింది.
• అద్దంకి, కేతవరం, అమ్మనబ్రోలు, నాగార్జున కొండ, బెల్లంకొండ దుర్గాలను స్వాధీనం చేసుకున్నాడు.
• విజయవాడ సమీపాన ఉన్న కొండపల్లి దుర్గమును రెండునెలలు పోరాడి స్వాధీనం చేసుకున్నాడు.
• అనంతగిరి, ఉర్లుగొండ, ఉండ్రుగొండ, అరసవిల్లి, చిట్యాల, నల్లగొండ మొదలైన దుర్గాలను జయించాడు.
• కోనసీమ, జమ్మిలోయ, కోరాము, రాజమహేంద్రవరము లను జయించినాడు.
• మాడుగుల, వడ్డాది, సింహాచలములను స్వాధీనం చేసుకొని సింహాచల నరసింహ స్వామిని పూజించి అనేక దాన ధర్మాలు చేసినాడు.
• కటకం పైకి దండెత్తి ప్రతాపరుద్ర గజపతి ని ఓడించి అతని కుమార్తె తుక్కా దేవి ని వివాహమాడాడు.
ఈ దిగ్విజయ యాత్ర తరువాత రాయలు 1516 లో రాజధానికి తిరిగి వచ్చాడు.
బీజాపూరు దండయాత్ర
1520లో బీజాపూరు పైకి దండయాత్రకు సిద్ధమయినాడు. దీనికి రెండు కారణములు చూపుతారు. మద్గల్లు, రాయచూరు దుర్గములను సుల్తాను ఆక్రమించుట మరియు సయ్యద్ మరైకర్ అను వ్యాపారి రాయల వద్ద డబ్బులు తీసుకుని ఇస్తానన్న అరేబియా జాతి గుర్రాలను ఇవ్వకుండా బీజాపూరు సుల్తాను దగ్గర ఆశ్రయం పొందినాడు; తాకీదు పంపించినా ఈ వ్యాపారిని సుల్తాను రాయలకు అప్పజెప్పలేదు, రాయలు సొమ్ము ఇప్పించనూ లేదు.
సైనిక వివరములు
న్యూనిజ్ అను పోర్చుగీసు యాత్రికుని ప్రకారం సైన్యం ఇలా ఉన్నది:
1. కామా నాయకుడు (పెమ్మసాని రామలింగ నాయుడు) : 30,000 కాల్బలము, వేయి అశ్వములు, పదహారు గజములు
2. త్రయంబకరావు: 50,000 కాల్బలము, రెండు వేల అశ్వములు, ఇరవై ఏనుగులు
3. తిమ్మప్ప నాయకుడు : 60,000కాల్బలము, 3,500 ఆశ్విక దళము, 30 ఏనుగులు
4. ఆదెప్ప నాయకుడు : లక్ష కాల్బలము, ఐదువేల ఆశ్విక దళము, 50 ఏనుగులు
5. కొండమ రెడ్డి 1 : 1,20,000 కాల్బలము, 6000 గుర్రాలు, 60 ఏనుగులు
6. కొండమ రెడ్డి 2 : 80,000 కాల్బలము, 2050 గుర్రాలు, 40 ఏనుగులు
7. సాళువ గోవింద రాజు : 30,000 కాల్బలము, 1000 గుర్రాలు, 10 ఏనుగులు
8. మధుర నాయకుడు : 15,000 కాల్బలము, 200 గుర్రములు
9. కుమార వీరయ్య : 8,000 కాల్బలము, నాలుగు వందల గుర్రములు
10. రాయలు : 44,000 కాల్బలము, 7,000 గుర్రములు, 315 ఏనుగులు
మొత్తం 5,37,000 కాల్బలము, 27,150 గుర్రములు, 1151 ఏనుగులు. పోరు భీకరముగా జరిగింది. ఇరువైపులా అనేక మంది నేలకూలారు. ఆదిల్ షా ఏనుగునెక్కి పారిపోయినాడు. సేనానులు దిక్కుతోచని వారైనారు. చివరకు ఎంతో ప్రాణ నష్టము తరువాత యుద్ధం 1520 మే 19న ముగిసింది. ఈ విజయం వలన రాయలుకు విశేషమైన డబ్బు, గుర్రాలు, ఏనుగులు లభించినాయి.
రాయచూరు యుద్ధము
తరువాత రాయచూరు కోటను ముట్టడించి ఇరవై రోజులు యుద్ధం చేసి పోర్చుగీసు సైనికుల సహాయంతో విజయం సాధించాడు (రాయచూరి యుద్ధము). రాయలు రాజధానికి వెళ్ళినా, త్వరలోనే మరలా ముద్గల్లు, బీజాపూరు లను ముట్టడించి ధ్వంస పరచి కల్యాణి, గుల్బర్గా కోటలను స్వాధీనం చేసుకున్నాడు.

తరువాత రాయలు రాజధానికి వచ్చి నిశ్చింతగా కవితా గోష్టులను నిర్వహించినాడు.
వారసులు
• ఇతనికి ఇద్దరు భార్యలు, తిరుమల దేవి, చిన్నాదేవి .
• ఇద్దరు కుమార్తెలు, వారిలో పెద్ద కూతురు తిరుమలాంబను రామ రాయలు కు, చిన్న కూతురును రామ రాయలు సోదరుడైన తిరుమల రాయలు కు ఇచ్చి వివాహం చేసాడు.
• ఒక్కడే కొడుకు, తిరుమల దేవ రాయలు . ఇతనికి చిన్న తనంలోనే పట్టాభిషేకం చేసి, తానే ప్రధానిగా ఉండి రాజ్యవ్యవహారాలు చూసుకునేవాడు. కాని దురదృష్టవశాత్తూ తిరుమల దేవ రాయలు 1524 లో మరణించినాడు. ఈ విషయం పై కృష్ణ దేవ రాయలు తిమ్మరుసును అనుమానించి అతనిని గుడ్డివానిగా చేసాడు. తానూ అదే దిగులుతో మరణించినాడని ఓ అభిప్రాయము. మరణానికి ముందు చంద్రగిరి దుర్గమునందున్న సోదరుడు, అచ్యుత రాయలు ను వారసునిగా చేసాడు.
• రాజ్య పాలన
240 కోట్ల వార్షికాదాయము కలదు.
సాహిత్య పోషకునిగా
కృష్ణదేవరాయలు స్వయంగా కవిపండితుడు కూడా కావడంతో ఇతనికి సాహితీ సమరాంగణ సార్వభౌముడు అని బిరుదు. ఈయన స్వయంగా సంస్కృతంలో జాంబవతీ కళ్యాణము, తెలుగులో ఆముక్తమాల్యద లేక గోదాదేవి కథ అనే గ్రంథాన్ని రచించాడు. రాయల ఆస్థానమునకు భువన విజయము అని పేరు. భువనవిజయము లో అల్లసాని పెద్దన, నంది తిమ్మన, ధూర్జటి, మాదయ్యగారి మల్లన (కందుకూరి రుద్రకవి), అయ్యలరాజు రామభద్రుడు, పింగళి సూరన, రామరాజభూషణుడు (భట్టుమూర్తి), తెనాలి రామకృష్ణుడు అనే ఎనిమిది మంది కవులు ఉండేవారని ప్రతీతి. వీరు అష్టదిగ్గజములు గా ప్రఖ్యాతి పొందారు.
అష్టదిగ్గజములు
1. అల్లసాని పెద్దన,
2. నంది తిమ్మన,
3. ధూర్జటి,
4. మాదయ్యగారి మల్లన (కందుకూరి రుద్రకవి),
5. అయ్యలరాజు రామభద్రుడు,
6. పింగళి సూరన,
7. రామరాజభూషణుడు (భట్టుమూర్తి),
8. తెనాలి రామకృష్ణుడు
9. కవిగా
ఇతను మత సహనం కలవాడు. అనేక వైష్ణవ, శైవ దేవాలయములను నిర్మించినాడు; అనేక దాన ధర్మాలు చేసినాడు. ముఖ్యంగా తిరుమల శ్రీనివాసులకు పరమ భక్తుడు, సుమారుగా ఆరు పర్యాయములు ఆ దేవదేవుని దర్శించి అనేక దానధర్మాలు చేశాడు. ఇతను తన కుమారునికి తిరుమల దేవ రాయలు అని, కుమార్తెకు తిరుమలాంబ అని పేర్లు పెట్టుకున్నాడు. రాయలు విజయనగరాధీశులందరిలోకీ చాలా గొప్పవాడు, గొప్ప రాజనీతిజ్ఞుడు, సైనికాధికారి, భుజబల సంపన్నుడు, ఆర్ధిక వేత్త, మత సహనము కలవాడు, వ్యూహ నిపుణుడు, పట్టిన పట్టు విడువని వాడు, కవి పోషకుడు, రాజ్య నిర్మాత మొదలగున్న సుగుణాలు కలవాడు. ఇతను దక్షిణ భారతదేశం మొత్తం ఆక్రమించినాడు.

1 comment:

  1. ఉగ్గుపాల నుండి ఉయ్యాలలో నుండి
    అమ్మపాట పాడినట్టి భాష
    తేనె వంటి మందు వీనులకు విందు
    దేశ భాషలందు తెలుగు లెస్స!

    సంస్కృతంబు లోని చక్కర పాకంబు
    అరవ బాష లోని అమృత రాశి
    కన్నడంబు లోని తేట తెలుగు నందు
    వేన వేల కవుల వెలుగులో రూపొంది!!

    దేశ దేశములలో వాసి గాంచిన భాష
    వేయి యేండ్ల నుండి విలసిల్లు నా భాష
    దేశ భాసలందు తెలుగు లెస్స!!!

    --
    శుభాకాంక్షలతో!
    శ్రీ కృష్ణదేవరాయ
    " రాయల వారి జన రంజక పరిపాలనను ఆంధ్ర దేశంలో తీసుకురావాలనేదే జీవిత లక్ష్యం"

    ReplyDelete