Tuesday, April 16, 2013

తెలుగు భాషోద్దారకుడు శ్రీ కృష్ణదేవరాయలు !

శ్రీకృష్ణదేవరాయల పంచశతాబ్ది పట్టాభిషే కోత్సవం కర్ణాటకలోని బళ్ళారి జిల్లా 'హంపి'లో 2010 జనవరి 27, 28, 29 తేదీల్లో 'హంపీ మహోత్సవ్‌' పేర కర్ణాటక ప్రభుత్వం ఎంతో డబ్బు ఖర్చుచేసి మహా వైభవంగా నిర్వహించింది. ఆ సందర్భంలో ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ ఆంగ్ల దినపత్రికలో ప్రచురితమైన ఆనాటి సమాచార వివరణలో ప్రొ|| ఎం.ఎం.కల్‌బురిగి ప్రసంగంలోని మాటలు అందరినీ ఆకర్షించాయి. కల్‌బురిగి గారు హంపిలోని కన్నడ విశ్వవిద్యాలయం మాజీ కులపతులు; పండితులు; విమర్శకులు. వారు ఆంగ్లంలో వివరించిన మాటలు గమనించదగ్గవి. 'విజయనగర సామ్రాజ్య సార్వభౌముడు (శ్రీకృష్ణదేవరాయలు) వాస్తవానికి కన్నడ సంస్కృతి అంటే అభిమానమున్న వాడేనా, పోషించినవాడేనా అని ఆలోచించాలి. ప్రస్తుతం కర్ణాటకలో శ్రీకృష్ణదేవరాయలు కన్నడ సంస్కృతికి అత్యుత్సాహం చూపలేదని భావించే కన్నడ పరిశోధకులు, కన్నడ చారిత్రకవేత్తలు చాలామందే ఉన్నారు. అంతేగాక శ్రీకృష్ణదేవరాయలు కర్ణాటక ప్రాంతంలో వలసదారులు చొరబడటానికి పాక్షికంగా బాధ్యుడు'.
'కన్నడ భాషాభ్యున్నతికి శ్రీకృష్ణదేవరాయులు ఏ మాత్రం కృషి చేయలేదు. శూన్యం. ఆయనను కన్నడ వ్యతిరేకి అనడానికి నేనుమాత్రం సందేహించడం లేదు. ఒక రకంగా మా భాషను (కన్నడం) తొక్కిపె ట్టాడు. తన ఆస్థానంలో తెలుగు కవులను పోషిం చాడు. అంతేగాదు, దీనికితోడు తమిళులను ప్రోత్స హించాడు. ప్రస్తుతం బెంగళూరులో ప్రముఖ స్థానా ల్లో తమిళులు జీవిస్తున్నారంటే, దీనికంతటికీ శ్రీకృష్ణ దేవరాయలే కారణం' అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇంతేగాదు ప్రొ|| కల్‌బురిగి కన్నడ భాషలో 'కృష్ణదేవరాయ తెలుగు సంస్కృతియ ఆక్రమణ' (కృష్ణదేవరాయల తెలుగు సంస్కృతి ఆక్రమణ) అనే పేరుతో రచించిన వ్యాసంలో శ్రీకృష్ణదేవరాయులు తెలుగువాడు కాబట్టి తెలుగు భాషా సాహిత్య సంస్కృతులకిచ్చినంత ప్రాధాన్యం కన్నడ భాషా సాహిత్యాల కివ్వలేదని చాలా ఆవేదన వ్యక్తం చేశారు. 'శ్రీకృష్ణ దేవరాయలు స్వంతంగా ఆముక్తమాల్యద కావ్యాన్ని తెలుగులో రచించాడు. అష్టదిగ్గజాలనే పేరుతో తెలుగులో ఎనిమిదిమంది ప్రసిద్ధ కవులకు ఆశ్రయమిచ్చాడు. అల్లసాని పెద్దనకవికి 'ఆంధ్ర కవిపితామహుడు' అన్న బిరుదుతో సత్కరించి, తమ చేతులతో ఆ కాలికి గండపెండేరం తొడిగి, ఆ కవి పల్లకిని తాను మోసి ప్రసిద్ధికెక్కాడు. తెలుగు సాహిత్య చరిత్రలో కృష్ణదేవరాయల యుగం 'స్వర్ణయుగంగా నిర్మించి తెలుగు భాష, సాహిత్యాలకు కర్ణాటకలో ప్రాధాన్య మిచ్చి ప్రసిద్ధి తెచ్చాడు. రాయలు కన్నడ రాజయినప్పటికీ 'ఆంధ్రభోజుడు'గా కీర్తింపబడ్డాడు. పై పెచ్చు 'దేశభాషలందు తెలుగు లెస్స' అని చాటాడు. తెలుగుభాష తరువాత ఆయనకు ప్రీతిపాత్రమైనది, పోషించింది 'సంస్కృతం'. స్వంతంగా తానే 'జాంబవతీపరిణయము' అనే పేరు తో సంస్కృతంలో నాటకం రచించాడు. సంస్కృతం లో అనేక గ్రంథ రచనకు అవకాశం కల్పించాడు. కాగా ఇతర భాషా సాహిత్యాల వైభవాలనడుమ గుడ్డిలో మెల్లగా చమత్కారంగా తిమ్మణ్ణ (కన్నడకవి) నుంచి ఒకే ఒక కన్నడ కావ్యం 'దత్తరార్ధ మహా భారతం' స్వీకరించాడు. బహుశా ఈ 'తిమ్మణ్ణ' పేరు వింటే తెలుగు మాతృభాషగా గలవాడై ఉంటాడని పిస్తుంది. మొత్తంమీద కృష్ణదేవ రాయల రాజ్యకాలం లో కన్నడ భాషా సాహిత్యాలకు ప్రోత్సాహం లేదనే చెప్పవలసి ఉంది'.
'తులనాత్మకంగా పరిశీలించి చెప్పాలంటే ఈ కర్ణాటక చక్రవర్తి కన్నడ దేశంలోని దేవతలకంటే తెలుగునాడులోని దేవతలకు ఎక్కువ తీర్ధయాత్రలు చేసినట్లు తెలుస్తుంది. కొన్ని దేవాలయాలకు ఒక్కొక్క సారి తీర్థయాత్ర చేసినా, తిరుపతికి మాత్రం ఏడు పర్యాయాలు తీర్ధయాత్ర చేసినతీరు గమనార్హం.'
'వాస్తవస్థితి ఏమంటే కృష్ణదేవరాయలు కర్ణాటక సంస్కృతికి మిక్కిలి హాని చేసినవాడుగా కనిపిస్తాడు. ఇప్పుడు దానికి సంబంధించి సత్యాలను శోధించ వలసిన అవసరముంది'.
'కృష్ణదేవరాయలు కన్నడ విరోధాన్ని ప్రారంభిం చాడు. తెలుగు పరోపకారమనే దుష్టపరిణామానికి తెరతీశాడు. కర్ణాటకలోని బళ్ళారి, రాయచూరు, కొప్పళ జిల్లాలు తెలుగువారి వశమయ్యాయి. వ్యాపారం, రాజకీయం మొ||నవి ఆ తెలుగువారి చేతుల్లోకి పోయాయి. ఇంతేగాక తుంగభద్రానది ఆనకట్ట సిద్ధమయ్యేసరికి తెలుగువారు కన్నడిగుల అపార భూములను కొన్నారు. ఒక అర్థంలో వారు కొన్నది పొలం కాదు. భూమి కొన్నారు. ఈ మూడు జిల్లాల్లో రాజకీయంగా శాసనసభ మొదలుకొని మండల పంచాయితీ, తాలూకా పంచాయితీలలో అధ్యక్షత వహించి, తెలుగువాళ్ళే ఏలుతున్నారు. కర్ణాటక దేవుడైన విరూపాక్ష దేవుని ఆచార్యత్వంలో తెలుగువారే ముందున్నారు. వీటన్నింటిలోను శ్రీకృష్ణదేవరాయలు తెలుగువారికిచ్చిన అవకాశాల్లో మూలాలున్నాయి'.
ఇలాగే ఇంకా శోధిస్తే అనేకాంశాలు తెలుస్తా యని పేర్కొన్నారు ప్రొ|| కల్‌బురిగి గారు.
ప్రొ|| కల్‌బురిగి ఆవేదనతో పేర్కొన్న మాటలలో ఎంతవరకు సత్యముందో కొందరు ఇతర కన్నడ సాహితీవేత్తల, చరిత్రకారుల మాటలను గమనిస్తే మనకు స్పష్టమవుతుంది. రాయలు ఎక్కడివారు? సొంతభాష ఏది? రాజభాష ఏది? అనే అంశాలను పరిశీలించవలసి ఉంది.
డా|| సూర్యనాధకామత్‌ తుళువంశ మూలాల్ని వివరిస్తూ తుళువంశ సంభూతులుగా వీరిని యాదవులుగా పేర్కొన్నారు. తుళునాడు నుంచి వచ్చారని కూడా చెప్పారు.
ప్రసిద్ధ చరిత్రకారులు మారేమండ రామారావు కూడా 'కృష్ణదేవరాయ' అనే ఆంగ్ల గ్రంథంలో ఈ అంశాల్నే పేర్కాన్నారు. ఇంకా డా|| చా.రా.గోపాల్‌ సైతం ఈ అంశాన్ని స్థిరీకరించారు. 8 తుళువంశ సంజాతులనీ, వారు యాదవులనీ నిర్ణయం. ఈ విషయాలనే రాయలు ఆముక్తమాల్యదలోను, అల్లసాని పెద్దన మనుచరిత్రలోను, నంది తిమ్మన పారిజాతాపహరణంలోను తుర్వసువంశీయులని ప్రశంసించారు. కాగా నంది తిమ్మన కృష్ణదేవరాయలు రిష్ష్వంశ సంభూతుడు శ్రీకృష్ణ దేవరాయలు కృష్ణునిలా యాదవంశంలో జన్మించినట్లు స్పష్టం చేశారు.
'నాడు నేడును యాదవాన్యాయమునందు
జననమందెను, వసుదేవ మనుజవిభుని
కృష్ణుడను పేర నరసేంద్రు కృష్ణదేవ
రాయడనుపేరనాది నారావియన్నుండు.'(పు.12)
శ్రీకృష్ణదేవరాయల భాష కన్నడం. కానీ రాజభాష మాత్రం తెలుగు. ఈ విషయాన్ని కన్నడ సాహితీవేత్తలే పేర్కొన్నారు.
'ఈ చక్రాధిపత్యద రాజధాని విజయనగరం ఇల్లిన ప్రసిద్ధ అరస కృష్ణదేవరాయ. ఆతన ఆస్థానదల్లి అదను తెలుగు, ఆస్థానవల్లి అనేక భాషగళన్ను మాతనాడుత్తిద్దరు. ఆతన సహజ వాద భాషె కన్నడ' 'ఈ సార్వభౌముని రాజధాని విజయనగరం. ఇందు ప్రసిద్ద రాజు శ్రీకృష్ణదేవరాయలు. రాయల ఆస్థానం లోని భాష తెలుగు. ఆస్థానంలో అనేక భాషలు మాటలాడుతూ ఉంటారు. అయినా అతని సహజ మైన భాష కన్నడం కాబట్టి రాయలు అభిమానించే ఆస్థానంలోని అధికారభాష తెలుగు. తన మాతృభాష కన్నడం. అలాంటి కన్నడ రాయడు తెలుగును రాజభాష చేసుకోవడం విశేషం. 'దేశభాషలందు తెలుగులెస్స' గనుక.
తెలుగును అధికార భాషగా చేసుకొన్న ఘనత రాయలవారిది. ఈ విషయాన్ని శ్రీనిడదవోలు వెంకటరావు స్థిరీకరించారు. 'తెలుగు అధికార భాష: నేడాంధ్ర రాష్ట్రమున తెలుగును అధికార భాషగా చేయు ప్రయత్నములు సాగుచున్నవి. కానీ ఇప్పటికి నాలుగు వందల యేండ్ల క్రిందటనే కృష్ణదేవరాయలు, తెలుగును అధికార భాషగా చేసినాడు' అధికార భాషగా తెలుగు చేయడమేగాక 'దేశభాషలందు తెలుగులెస్స' అని చాటినది రాయలే. తెలుగు, కన్నడ, తమిళ భాషల రాజులు తమ సభలోనుండగా, రాయలు తెలుగు భాషలోనే ప్రసంగించెను. తెలుగు భాష (రాజకీయాధికార భాష)లోనే మాట్లాడెనని సిద్ధాంతము. తెలుగును మొదట అధికార భాషగా చేసిన కీర్తి ఆయనకే దక్కినది'.
కాగా రాయలు తెలుగు కవి పండితులను మాత్రమే పోషించాడనీ, రాయలు తెలుగు సంస్కృతికి మాత్రమే వారసుడని ప్రొ|| కల్‌బురిగి పేర్కొని ఆవేదనను ప్రకటించినప్పటికీ అది వాస్తవం కాదని భావించవలసి ఉంది.
శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా కవి. సంస్కృతంలోనేగాక తెలుగులో 'ఆముక్తమాల్యద' మహాప్రబంధకర్త. అష్టదిగ్గజ కవుల పోషకుడు. ఇంతేగాదు కన్నడకవి 'తిమ్మణ్ణ' రచించిన 'భారత కథామంజరి' కన్నడ కావ్యాన్ని అంకితం పుచ్చుకొన్నారు. కన్నడ భాషలో దాస సాహిత్యానికి మూల పురుషుడైన వ్యాస రాయలు రాయల రాజగురువు వ్యాసరామ మఠంలో పురంచరదాసు, కనకదాసాది కన్నడ కీర్తనకారులు రాయల పోషణలోని వారే. ఆంధ్ర దేవాలయాలతో పాటు కన్నడ దేవాలయాలను దర్శించి కానుకలర్పించిన మహా ధార్మికుడు. ఈ వివరణతో ప్రొ|| కల్‌బురిగి ఆవేదన పరాస్తమవుతుంది.
శ్రీకృష్ణదేవరాయులు తుళువంశ సంభూతుడు. కన్నడం తన భాష. కానీ రాయల తల్లి నాగలాంబ. తెలుగు వనిత. తల్లి భాష తెలుగు. తెలుగుతోపాటు ఆనాటి దక్షిణదేశ స్థితినిబట్టి కన్నడం, తమిళభాషలను పోషించిన మహనీయుడు. చిత్రశిల్ప కళలను, సంగీతములను సమంగా పోషించిన కళాప్రియుడు. దేవాలయ నిర్మాణంలో అతనికతనే సాటి. అన్ని యుద్ధాలలోను విజేత. భారత జాతీయ సమైక్యాన్ని, లౌకికవాదాన్ని ఆదరించి, శ్రేయోరాజ్యాన్ని నిర్మించిన మహోన్నత వ్యక్తి- కాదు- శక్తి. ఆ మహనీయుని పంచశతాబ్ది పట్టాభిషేకోత్సవాలు ప్రజలకు స్ఫూర్తిదాయకం. పై పెచ్చు తెలుగు భాషకు ఆనాడే ఎంతో ప్రాధాన్య మిచ్చిన తెలుగు భాషా ప్రియుడు, పోషకుడు.
'తెలుగ దేలయన్న దేశంబు తెలు, గేను
తెలుగు వల్ల భుండ, తెలుగొకండ
ఎల్లనృపులుగొలువ నెరుగనేబాసాడి ,
దేశభాషలందు తెలుగులెస్స'.
- ఆచార్య ఎస్‌.గంగప్ప