Tuesday, August 10, 2010

కమనీయ దృశ్యం.. కనిగిరి దుర్గం

గత వైభవాలకు ప్రతిరూపాలే చారిత్రక కట్టడాలు !   కోట్లు వెచ్చించినా కట్టలేని అలాంటి కట్టడాలు మన రాష్ట్రంలో అనేకం ఉన్నాయి. వాటిని కాపాడుకోవాల్సిన భాధ్యత ప్రభుత్వం, మనందరిపైనే ఉంది. ఆ కోవకు చెందినదే ‘కనిగిరి’ దుర్గం.  
ప్రకృతి అందచందాలతో అలలారే ఈ దుర్గం నాటి నుండి నేటి వరకు గత వైభవానికి చిహ్నంగా, కమనీయంగా వెలుగొందుతుంది. రాజులు, రాజ్యాలు అంతరించినా వారి ప్రాభవానికి, కళాతృష్ణకు ఆనవాలుగా నిలిచిన ఎన్నో అద్భుతమైన కళాఖండాలు నేటికి ఇక్కడ దర్శనమిస్తున్నాయి. ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలుకు 80 కిలోమీటర్ల దూరంలోనున్న... ఒకప్పుడు ‘కనకగిరి’గా ఖ్యాతిగాంచిన నేటి కనిగిరి దుర్గం చరిత్ర ఇది.
చరిత్ర కలిగిన కనిగిరిలోనే 13-14 వ శతాబ్దంలో యాదవ రాజైన కాటమరాజు, మనుమసిద్దులకు పోరాటం జరిగింది. అనంతరం శ్రీ కృష్ణదేవరాయలు కనిగిరి దుర్గంలో కొలువు ఏర్పరుచుకొన్నాడు. ఈ దుర్గంలో ఉన్న చెన్నముక్క బావి, సింగరప్ప దేవాలయాలు ఆయన కాలంలో నిర్మితమైనవే. ఇవి నేటికి సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. వీరి కాలంలోనే నిర్మించిన కోటబురుజులు, ప్రహరీ, లోదుర్గంలోని మందుకొట్టాలు, చెన్నమ్మబావి, గుర్రపుశాలలు, ఏనుగుల బావి, మండాలు చరిత్ర మరవని చారిత్రాత్మక దృశ్యాలు. ఆ తరువాత 1520 లో వీరభద్ర గజపతి, రెడ్డిరాజులు ఈ ప్రాంతాన్ని పాలించగా... 1776లో కనిగిరి దుర్గం సుల్తానుల ఏలుబడిలో ఉన్నట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. లోదుర్గం చుట్టూ ఉండే 26 కిలోమీటర్ల కోటగోడ ఇప్పుడు 20 కిలోమీటర్ల మేర ఉండి చూపరులను అమితంగా ఆకర్షిస్తున్నది.
బొగ్గుల గొంధి ప్రాంతంలోని కోటగోడ ప్రధాన ద్వారం గుండానే నాడు ఇక్కడ పరిపాలించిన రాజులు రాకపోకలు సాగించారని ప్రతీతి. కోటకు నాలుగు వైపుల ఉండే నాలుగు కోట బురుజుల్లో 3 బురుజులు సందర్శకులను కట్టిపడేస్తున్నాయి. దొరువుకు సమీపంలో ఉండే ప్రధాన బురుజులలో ఒకటైన బురుజు పర్యాటకులకు ఇక్కడి చారిత్రక ప్రసిద్ధిని గుర్తుచేస్తున్నది. లోదుర్గంలోని దుర్గమ్మ గుడి, సీతారాముల గుడి గత వైభవాలకు చిహ్నలుగా నిలిస్తున్నాయి. కోటలో ప్రత్యేక ఆకర్షణగా ఉన్న మందుకొట్లు, మండెం, ఏనుగులబావి, గుర్రపుశాలలు, నీటి కొలనులు, సువిశాల ప్రాంగణం, కొలనులో నీటి చలమలు ప్రకృతితో పోటీ పడుతూ వీక్షకులను అలరిస్తున్నాయి.
40 అడుగుల పొడవు, 10 అడుగుల వెడల్పు ఉండే మూడు అరలుగల మందుల కొట్లు ఆనాటి రాజుల యుద్ధ సామర్ధ్యానికి ప్రతీకలుగా ఉన్నాయి. ఈ దుర్గంలో 2 కిలోమీటర్లు వ్యాపించి ఉండే నేలగొయ్యి, రహస్య గొయ్యి, నాగుల పొదలు సైతం నేటికి సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. నాటి చారిత్రక కట్టడాలకు స్వాగత తోరణంగా ఉన్న కనిగిరిని ఆనుకొని ఉన్న దుర్గం దానికి ముందుండే సింగరప్ప ఆలయం గత స్మృతులకు నిదర్శనం. రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన వారు లోదుర్గంలోని వింతలను, విశేషాలను, పరిశోధనాత్మకంగా తిలకిస్తూ, సందర్శిస్తున్నారు. ప్రతి ఏడాది వేసవి కాలంలో కనిగిరి కోటను సందర్శించడం కోసం ఇతర రాష్ట్రాల నుండి సైతం పర్యాటకులు అధికసంఖ్యలో రావడం విశేషం. దేశ సంస్కృతికి, పురాతన చరిత్రకు సాక్ష్యాలుగా మిగిలిన ఈ ప్రాచీన కట్టడాలు కాలగర్భంలో కలసిపోకుండా కాపాడాలంటే పురావస్తు శాఖ, రాష్ట్ర పర్యటక శాఖ చర్యలు శ్రద్ధవహించి గత వైభవాన్ని నేటి, భావితరాలకు అందించే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
కోటలోని ప్రత్యేక ఆకర్షణలు...
దుర్గం చుట్టు ఉండే కొండ పై భాగంలో అక్కడక్కడ ప్రకృతి పేర్చిన అందాలు చూపరులను అమితంగా ఆకట్టుకుంటాయి. వీటిలో ముఖ్యంగా బొగ్గుల గొంధి ప్రాంతంలో ఉన్న తాబేలు రాయి, దుర్గం ఉత్తరం వైపునున్న ఉగ్గుగిన్నె రాయి, దుర్గంలోనున్న డైనోసార్‌ రాయి, చింతకాయ రాయి, పాము రాయి, అక్కా చెల్లెళ్ళ బండలు, చేపరాయిలు ప్రధానాకర్షణగా ఉన్నాయి. వీటి నుండే ఆదిమానవుని రూపాంతరం వెలువడినట్లు చారిత్రాత్మక ఆధారాలు ఉన్నాయి.
                                                                                             - బత్తుల రామ్‌ప్రసాద్‌

No comments:

Post a Comment