సాహితీ సమరాంగణ చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల 500 వ పట్టాభిషేక ఉత్సవాలు హంపీలో ఘనంగా జరుగుతాయని తెలిసి ఆ ఉత్సవాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నాం. మా మిత్ర వర్గంలోని అరబోలు వీరాస్వామి, ధర్మిశెట్టి రమణ లతో హంపి ఉత్సవాలకు వెళ్లేందుకు సిద్దమయ్యాం.
' దేశభాషలందు తెలుగు లెస్స' అని ఎలుగెత్తి చాటిన శ్రీకృష్ణదేవరాయలన్నా , భాషా, సాహిత్యం కళలకు దాదాపు 300 ఏళ్ల పాటు రాజధానిగా విలసిల్లిన విజయనగరం అన్నా అభిమానం ఉండని వారుండరు కదా!
హంపిలో 2010 జనవరి 27, 28, 29 తేదీలో శ్రీకృష్ణ దేవరాయల పట్టాభిషేక 500 వ వార్షికోత్సవాలు జరిగాయి. 28 వ తేది గురువారం ఉదయం మైదుకూరు నుండి బయలు దేరి కడపకు చేరుకున్నాం. చిత్తూరు-హుబ్లీ ల మధ్య తిరిగే ఫాస్టు ప్యాసింజరులో కడప నుండి హోస్పేట వరకు మా ప్రయాణం! ఉదయం 9-45 కు రైలు వచ్చింది.
దాదాపు 300 కి.మీ. ల మా ప్రయాణం చాలా ఆహ్లాదకరంగా సాగింది. సాయంత్రం ఐదు గంటలకు రైలు మేము దిగాల్సిన హోస్పేటకు చేరింది. ఈ పట్టణానికి 14 కి.మీ. దూరంలోనే హంపి క్షేత్రం ఉంది. అలాగే ఇక్కడికి 7 కి.మీ. ల దూరంలో తుంగభద్ర డ్యాం కూడా ఉంది. స్టేషన్ బయట విజయనగరపు రాజచిహ్నంతో నిర్మించిన ఐల్యాండ్ మమ్మల్ని ఆకర్షించింది. పంది, కత్తి, సూర్యచంద్రులతో కూడిన ఈ రాజచిహ్నాన్ని గ్రానైట్ శిలలపై అందంగా చెక్కారు. అక్కడినుండి బస్టాండుకు చేరాం.
రాయల పట్టాభిషేక మహోత్సవాలను తిలకించేందుకు దేశ విదేశాలనుండి తరలివచ్చిన వేలాది మంది పర్యాటకులతో హోస్పేట బస్టాండు క్రిక్కిరిసి ఉంది. హంపిలో జరిగే రాయల పట్టాభిషేక మహోత్సవాల సమాచారాన్ని పర్యాటకులకు తెలిపే కౌంటర్లను బస్టాండు ఆవరణంలో ఏర్పాటు చేశారు. హోస్పేట పట్టణంతో పాటు హంపికి వెళ్లే దారి పొడవునా గోడలపైనా, ఫ్లెక్సీ కటౌట్లపైనా ఆనాటి విజయనగర వైభవానికి దర్పణం పట్టే చిత్రాలను రంగుల్లో చిత్రించారు. కృష్ణరాయల ఉత్సవాలకు తోరణాలు కట్టినట్లుగా హోస్పేట నుండి హంపి వెళ్లేదారిలో పచ్చని అరటి, చెరుకు తోటలు స్వాగతం పలికాయి. రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లను విద్యుల్లతలతో అలంకరించారు. చిన్నగా చీకట్లు ముసురుకుంటుండగా, గగనతలాన్ని సాయంకాలపు అరుణకాంతి ఆవరించి ఉన్న హంపిలో అడుగు పెట్టాం!
విదేశీ పర్యాటకులు అక్కడ అందాలను ఆస్వాదిస్తూ తన్మయత్వం చెందుతున్నారు. పడవలో ఉత్తర తీరాన్ని చేరుకుంటే అక్కడినుండి విదేశీయుల విడిది కేంద్రాలకు, రిసార్టులకు, ఆనెగుంది, గంగావతిలకు వెళ్లవచ్చు. గంగావతిలో పాత్రికేయులుగా పనిచేస్తున్న మిత్రులు తిరుపాలయ్య, జాకీర్లు మమ్మల్ని కలుసుకున్నారు. 14 కి.మీ. దూరంలోని గంగావతిలోని ప్రభుత్వబంగళాలో వారు విడిదిని ఏర్పాటు చేశారు. ఆనెగొంది మీదుగా ఆ అర్థరాత్రి సమయంలో మిత్రులు ఏర్పాటు చేసిన బైకులపై గంగావతికి బయలు దేరాం. ఉదయం తిరిగి హంపికి వచ్చేటప్పుడు మార్గమధ్యంలోని ఆనెగుందినీ, అంజనాద్రినీ, పంపా సరోవరాన్నీ చూడాలనుకున్నాం. కొప్పల్ జిల్లా పరిధిలో ఉన్న గంగావతి పట్టణం చిన్నదే అయినా అందమైన తాలూకా కేంద్రం. మనరాష్ట్రంలోని కోనసీమలా పాడి, పంటలతో పచ్చగా విలసిల్లే గంగావతిని 'రైస్బౌల్ ఆఫ్ కర్నాటక' అని అంటారు. గంగావతి పరిసర ప్రాంతాల్లో కన్నడ సినిమా షూటింగులు జరుగుతుంటాయి. గంగావతి చేరేటప్పటికే బాగా అలసి ఉన్న మేము, విడిదిలో హాయిగా నిదురపోయాం.
కొత్త ప్రదేశంలో ఉషోదయపు అనుభూతులు ఆహ్లాదకరంగా ఉంటాయి. నీరెండ శీతల గాలులలో గంగావతి పట్టణం శోభాయమానంగా తోచింది. ఉదయమే గంగావతి నుండి హంపికి బయలుదేరాం.
విజయనగర తొలి రాజధాని 'ఆనెగుంది'
గంగావతి నుండి హంపి వెళ్లే దారిలో ఉన్న 'ఆనెగుంది' గ్రామస్తులు కూడా రాయల పట్టాభిషేక ఉత్సవాలను నిర్వహిస్తున్నారని తెలిసింది. ఆనెగుంది గ్రామంలో ఆగాం. హంపి, తుంగభద్ర నదికి దక్షిణతీరంలో ఉంటే, ఆనెగుంది హంపికి ఈశాన్యంగా రెండు కిలోమీటర్ల దూరంలో నది ఉత్తర తీరంలో ఉంది. 'ఆనె' అంటే ఏనుగు అనీ, 'గుంది' అంటే గుంత అని అర్థం. ఆనెగుందికి హస్తినాపతి, కుంజరకోన అనే పేర్లుకూడా ఉన్నాయి. ఆనెగుంది రామాయణ కాలంలో వానరుల రాజధాని కిష్కిందగా చెప్పబడుతోంది.
13వ శతాబ్దం ప్రథమార్థంలో ఆనెగుంది ప్రాంతాన్ని పరిపాలిస్తుండిన జంబుకేశ్వర రాయలును ఢిల్లీ సుల్తాన్ తుగ్లక్ ఓడించి ఆనెగుందిని స్వాధీనపర్చుకుంటాడు. ఆనెగుంది పాలనా బాధ్యతలను తుగ్లక్ తన ప్రతినిధి మాలిక్నాయబ్కు అప్పగిస్తాడు. నాయబ్ ఎప్పుడూ విలాసాల్లో మునిగితేలుతూ,మత్తులో జోగుతూ ప్రజాకంటకుడుగా వ్యవహరిస్తూఉండేవాడు. హరిహరరాయలు, బుక్కరాయలు నాయబ్పై తిరుగుబాటును లేవదీసి ఆనెగుందిని స్వాధీనం చేసుకుంటారు. ఆతర్వాత విజయనగర సామ్రాజ్యస్థాపన జరుగుతుంది. విజయనగర సామ్రాజ్యాన్ని ఆనెగుంది నుండి హంపి(విజయనగరం)కి మార్చిన తర్వాత ఆనెగుందిలో పెద్ద గజశాలను నిర్వహించేవారట! విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన చివరి రాజవంశం అరవీడు వంశం. ఆ వంశవారసులైన రాజా శ్రీరామదేవరాయలు ఆధ్వర్యంలో ఆనెగుందిలో మేళతాళాలతో అంగరంగవైభవంగా జరుగుతున్న ఉత్సవాల్లో కొందరు విదేశీయులతో పాటు మేము కూడా కలిసిపోయాం. ఆనెగుంది గ్రామాన్ని రంగవళ్లులతో, పూలతో సర్వోపసుందరంగా అలంకరించారు. చారిత్రక ప్రదేశాలూ, దేవాలయాలూ, కూడళ్లూ, వీధులూ సప్తవర్ణశోభను సంతరించుకున్నాయి. పచ్చని తోరణాలు గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. ఆనెగుందిలోని పురాతన రంగనాథస్వామి ఆలయం, గగన్మహల్ లను దర్శించాం. తుంగభద్ర నదీపాయలో శ్రీకృష్ణదేవరాయల సమాధిగా భావించే 64 స్థంభాల మండపం వద్ద కొంత సేపు గడిపాం! రాయలు 64 కళలందు పాండిత్యాన్ని గడించినందుకు చిహ్నంగా 64 స్థంభాలతో ఈ మండపాన్ని నిర్మించినట్లు చెబుతారు. అక్కడ రాయలవారికి ఘనంగా నివాళి అర్పించాం.
మరికొన్ని చారిత్రక కట్టడాలను చూశాం. సమీపంలో ఋష్యమూక పర్వతం, నవబృందావనం, చంద్రమౌళీశ్వర ఆలయం, శిధిలమైన పురాతన రాతివారధి, పంపాసరోవరం, రంగనాథగుహ, శబరి ఆశ్రమం ఉన్నాయి. పంపాసరోవరాన్ని చూసినతర్వాతపడవలో నదినిదాటి తిరిగి హంపిని చేరుకున్నాం.
అంతులేనిది.. హంపి సౌందర్యం!
తుంగభద్రనది ఒడ్డున్నే ఉన్న విరూపాక్ష ఆలయాన్ని సందర్శించాం. ఆలయంలో విరూపాక్షున్నీ, పంపాదేవి, భువనేశ్వరి అమ్మవార్లను దర్శించుకున్నాం. అక్కడి శిల్పాలనూ, చిత్రకళనూ, ఆలయ విశిష్టతలను గురించి తెలుసుకున్నాం.

రైలు ప్రయాణం ఆద్యంతం..ఆహ్లాదకరం!
మా రైలు ప్రయాణం ఆద్యంతం ఆహ్లాదకరంగా, ఆసక్తిగా సాగింది. కడపజిల్లా కమలాపురం ఎర్రగుంట్ల ప్రాంతాల్లో రైల్వేలైనుకు పక్కగా ఉన్న నాపరాళ్ల గనులను రైళ్లో వెళ్తూ చూశాం. భూగర్భంలో వరుపలు, వరుసలుగా నిక్షిప్తం అయి ఉన్న రాతి పలకలను బయటికి తీస్తున్న గనికార్మికుల శ్రమైకజీవన సౌందర్యాన్ని చూశాం. మా వెంట తిరుమల రామచంద్రగారి ' హంపి నుంచి హరప్పాదాకా' పుస్తకాన్ని తీసుకువెళ్లిన మేము అందులోని విజయనగర విశేషాలపై చర్చలు జరుపుకున్నాం. తినబోతూ రుచుల గురించి మాట్లాడుకున్నట్లుంది కదూ మా వ్యవహారం. కొండాపురం, తాడిపత్రి, గుత్తి ప్రాంతాల్లో జామపండ్లు, సపోటా పండ్లు విరివిగా పండుతాయి. ఆ ప్రాంత మహిళలు గంపలతో తెచ్చి పండ్లను రైళ్లలో అమ్ముతుంటూ ఉంటారు. పండ్లు చాలా రుచికరం.
గుత్తి స్టేషన్కు ముందున్న స్టేషన్ 'రాయలచెరువు'. రాయలవారు అక్కడ చెరువు తవ్వించడం వల్ల ఆ వూరికి 'రాయలచెరువు' అని పేరు వచ్చిందట!. శ్రీకృష్ణదేవరాయలు, మరికొందరు విజయనగర రాజులు రాయలసీమ ప్రాంతంలో వీలైన చోట్లల్లా చెరువులు తవ్వించినట్లుగా అప్పట్లో విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించిన విదేశీ యాత్రీకులు శ్లాఘించిన విషయం ఈ సందర్భంగా మా స్ఫురణకు వచ్చింది. భుక్తి, రక్తి, ముక్తి అంశాల్లో దేనికీ లోటు లేకుండా విరాజిల్లిన సామ్రాజ్యం, విజయనగర సామ్రాజ్యం. భుక్తి కోసం చెరువులు తవ్వించారు. రక్తి కోసం కళలు సాహిత్యాన్ని పోషించారు. ముక్తి కోసం దేవాలయాలను, ఆథ్యాత్మిక కేంద్రాలను నిర్మించారు. గుత్తి సమీపంలో రైలు పట్టాలకు దక్షిణంగా రెండు కి.మీ. దూరంలో గుత్తి దుర్గం కనిపించింది. 300 మీటర్ల ఎత్తులో ఒక కొండపై ఉన్న ఆ దుర్గాన్ని విజయనగర రాజులు నిర్మించారు. కడపకు 150 కి.మి., అనంతపురానికి 52 కి.మి. దూరంలో ఈ దుర్గం ఉంది. 15 ద్వారాలతో ఈ కోటను శత్రు దుర్భేధ్యంగా నిర్మించారట! రాయల చెరువు, గుత్తి ప్రాంతాల్లో రైలు పట్టాల పక్కగా సహజమైన రీతిలో పెరిగిన తాటితోపులూ, ఈతతోపులూ కనిపించాయి.
అప్పటికే మధ్యాహ్నభోజన సమయం దాటిపోయింది. మిత్రుడు వీరాస్వామి ఇంటి నుంచి పట్టుకొచ్చిన చిత్రాన్నం, చపాతీలు వాటిలోకి ఉర్లగడ్డ తాళింపు నోరూరిస్తున్నాయి. చిత్రాన్నంలో నిమ్మరసం, వేయించిన వేరుశనగ విత్తనాలు కలుపుతారు కదా! గుంతకల్లు దాటిన తర్వాత చిత్రాన్నాన్ని ఆరగించాం. గుంతకల్లు నుండి బయలుదేరిన రైలు మరో గంట సమయానికి బళ్లారికి చేరింది. బళ్లారి రైల్వే స్టేషన్కు ఒక కిలోమీటరు దూరంలోని ఒక గుట్టపై బళ్లారి కోట కనబడుతుంది. బళ్లారి కోటను కూడా విజయనగర రాజుల కాలంలో కనుమప్పనాయకుడనే ఆ ప్రాంత నాయకుడు నిర్మించాడట!. ఈ కోట ఉన్న గుట్ట ప్రపంచంలో రెండవ అతి పెద్ద ఏకరాతి గుట్టగా గుర్తింపు పొందింది. ఈ గుట్టను స్థానికులు బళ్లారిగడ్డ అని అంటారు.బళ్లారి దాటిన తర్వాత విరూపాపుర సమీపంలోని కర్నాటక సరిహద్దులో రైలు కర్నాటకలోకి ప్రవేశిస్తుంది. అక్కడికి సమీపంలో 'దరోజి' అనే గ్రామం ఉంది.ఇక్కడ విజయనగర ప్రథమ ప్రాకారానికి దర్వాజా ఉండటం వల్ల ఆ గ్రామానికి దరోజి అనే పేరు వచ్చిందని చెబుతారు.
బళ్లారి-తోరణగల్లు మధ్యలో విశాలమైన బీడుభూములు, వాటిలో పశువులను, గొర్రెలను మేపుకుంటూ పశువుల కాపరులు, అక్కడక్కడ పండిన కుసుమ చేలు, ఆ పంటను ఒడుపుకుంటూ రైతులు కనిపించారు. అలాగే బళ్లారి నుండి తోరణగల్లు వరకు రైలు పట్టాలకు ఇరువైపులా ఇనుపఖనిజం నిల్వచేసిన దిబ్బలు, వాటిని ఓడరేవులకు తరలించే లారీలు కొల్లలుగా దర్శనమిస్తాయి. ఎర్రగా ఇనుపఖనిజం దుమ్ము రేగుతూ ఉంటుంది. బళ్లారి, తోరణగల్లు, సాండూరు ప్రాంతం ఒక ఖనిజమేఖలగా గుర్తింపు పొందింది. పారిశ్రామికంగా బాగా అభివృద్ది చెందిన ఆ ప్రాంతంలోనే జిందాల్ విజయనగర్ స్టీల్స్ తదితర కర్మాగారాలు మనకు కనిపిస్తాయి. మా ప్రయాణంలో పాపాఘ్ని, చిత్రావతి, పెన్నా, హగరి, తుంగభద్ర నదులను కూడా దర్శించే అవకాశం కలిగింది.
హంపీ, అక్కడి పరిసరాల్లో మేం గడిపిన రెండు రోజులూ అంతా ఆదుర్దానే! ఒక పక్క హంపి అందాలు, మరో పక్క రాయల పట్టాభిషేక ఉత్సవాలు మమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. భువన విజయ సభా ప్రాంగణం, పద్మ మహల్, రాజప్రాసాదాలూ, రాణుల స్నానవాటికలూ, కావలి మండపాలూ, కిష్కింద, మాల్యవంత పర్వతం, మహర్నవమి దిబ్బ, రామలింగడి మండపం, కామలాపుర సంగ్రహశాల, ఇంకా ఇంకా చూడాల్సినవి ఎన్నో ఎన్నెన్నో మిగిలిపోయాయి. రెండే రెండు రోజుల్లో హంపిని ఆసాంతం చూడాలనుకోవడం అత్యాశే అవుతుంది కదా! అడుగు అడుగుకూ, జాముజాముకూ,ఋతువు ఋతువుకూ అందాలను మార్చుకుంటూ పర్యాటకులను అబ్బురపరిచే హంపి, నిజంగా ఓ అద్భుత కావ్యం..నవరసాలొలికించు రాచనగరం!
ఓబుల్ రెడ్డి గారూ,
ReplyDeleteచాలా ఆలస్యంగా మీ బ్లాగ్ చూస్తున్నాను. విజయనగర సామ్రాజ్యాధీశుడు కృష్ణదేవరాయల పేరుతో ఒక బ్లాగును మీరు రూపొందించండమే చాలా గొప్పగా ఉంది. ప్రత్యేకించి మీ హంపీ పర్యటన విశేషాలు చూస్తుంటే మన పురాతన వైభవోజ్వల ప్రాంతాన్ని ఎప్పుడెప్పుడు చూద్దామా అనే అనుభూతి కలిగింది. ఆద్యంతం మీ కథనం అలరించింది.
మీకు ఒక చిన్న సలహా. ఎలాగూ కృష్ణదేవరాయలపై బ్లాగ్ తెరిచారు కనుక కృష్ణదేవరాయలు, విజయ నగర సామ్రాజ్య చరిత్ర విశేషాలపై ఇంతవరకు తెలుగులో వచ్చిన, వస్తున్న వ్యాసాలను లేదా వాటి లింకులను మీ బ్లాగులోనే ఇస్తే హంపీ చరిత్రను అభిమానించేవారందరికీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వీలైతే ఇంగ్లీషులో హంపీ చరిత్రపై వచ్చిన విశిష్ట వ్యాసాలను కూడా సేకరించి వాటి లింకులను మీ బ్లాగులోనే పెట్టండి. హంపీ చరిత్రకు సంబంధించిన సమస్త సమాచారం ఒకే చోట ఉంటే బాగుంటుందనే నా ఉద్దేశం.
ఈ విషయంలో మీకు సహాయం చేయగలను. మీరు సరేనంటే నేను ఇంతవరకు సేకరించి పెట్టుకున్న కృష్ణదేవరాయల విశేషాల లింకులను మీకు పంపిస్తాను.
ఇంత మంచి బ్లాగును అందిస్తున్నందుకు ధన్యవాదాలతో...
రాజేశేఖరరాజు
చందమామ
rajasekhararaju21@gmail.com
mobile: 7305018409
రాజశేఖరరాజు గారికి నమస్కారములు! మీ స్పందనకు ధన్యవాదాలు. దీనిని నేను ఆలస్యంగా చూడటం జరిగింది. మీరు సేకరించిన లింకులను పంపండి. ధన్యవాదాలు.
Deleteఓబుళ రెడ్డి గారూ,
ReplyDeleteమంచిమనసులు సినిమా కోసం ఆత్రేయ 'అహొ ఆంధ్రభోజా.....'పాట ఏ ముహూర్తాన రాసాడో కానీ అప్పటినుంచి విఠలాలయం లోని రాతిరథం ఏకశిలరథం గా చలామణి అవుతోంది.కానీ ఆ రథాన్ని పరిశీలించి చూస్తే భిన్న శిలలతో చేసినట్లు ,వాటి మధ్య అతుకులు కనిపిస్తాయి.
(పాట లోని పంక్తి ....ఏక శిలరథముపై లోకేశు ఒడిలోన ...............)