Saturday, January 29, 2011

హంపి ఉత్సవాలలో ఆకట్టుకున్న కుస్తీ పోటీలు

శ్రీ కృష్ణదేవరాయల తపాళా బిళ్ళను ఆవిష్కరిస్తున్న సి.ఎం.యడ్యూరప్ప    
హంపి (28/01/11): హంపి ఉత్సవాలలో శుక్రవారం సాయంత్రం కడ్డిరాపురం వద్ద హిందూ కేసరి సాంబముత్కల్ అఖాడ మైదానంలో ఘనంగా కుస్తీ పోటీలను నిర్వహించారు. కర్ణాటక రాష్ట్రం నుంచే కాకుండా మహారాష్ట్ర, గుజరాత్, అస్సాం తదితర రాష్ట్రాల నుంచి సుమారు 50కి పైగా కుస్తీ జట్లు పోటీలలో పాల్గొన్నాయి. ప్రతి ఏటా మాదిరిగానే ఈఏడాది కూడా పురుషులకు, మహిళలకు కుస్తీ పోటీలను నిర్వహించారు. పురుషుల తొలి జట్టులో హొస్పేట నగరం మరియమ్మనహళ్లి గ్రామానికి చెందిన సైఫుల్లా, హొస్పేట నగరానికి చెందిన ప్రభుల మధ్య గట్టి పోటీ జరిగింది. మహిళల విభాగంలో ఢిల్లీకి చెందిన మహిళ కమలేష్, కర్ణాటక రాష్ట్రానికి చెందిన బెల్గాం నివాసి శ్రీలత పాటిల్ మధ్య గట్టి పోటీ ఏర్పడింది. శ్రీలత పాటిల్‌ను కమలేష్ మట్టి కరిపించి హంపి కుమార అనే వెండి గదను కైవసం చేసుకుంది. ఇంతకు మునుపు కమలేష్ అంతర్జాతీయ స్థాయిలో ఎనిమిది సార్లు అవార్డులను దక్కించుకుంది.
హంపి ఉత్సవాల్లో అలరించిన కుస్తీ పోటీలు
గత ఏడాది కూడా కర్ణాటక ప్రభుత్వం ఈమెకు ఏకలవ్య అవార్డును అందజేసింది. కుస్తీ పోటీలను జిల్లా ఇన్‌చార్జి, రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి గాలి జనార్దన్‌రెడ్డి ప్రారంభించగా, హొస్పేట ఎమ్మెల్యే ఆనంద్‌సింగ్, కోలారు ఎమ్మెల్యే వర్తూరు ప్రకాష్, సినీనటుడు సాయికుమార్, ఎంపీ శాంత, ఎమ్మెల్సీ మృత్యుంజయ జినగా తదితరులు పాల్గొని తిలకించారు. కుస్తీ పోటీల సందర్భంగా మైదానం పరిసరాలు వేలాది మంది ప్రేక్షకులతో కిక్కిరిసింది.
అలమారి జాతుల వారు అన్ని రంగాల్లో రాణించాలి
 భారత దేశ చరిత్రలో పురాణ ఇతిహాసాలు కథల రూపంలో సమాజానికి అందించే అలమారి జాతుల వారు సామాజిక, ఆర్థిక విద్య, కళా రంగాల్లో రాణించాలని రాష్ట్ర ఆరోగ్య శాఖామంత్రి శ్రీరాములు చెప్పారు. శుక్రవారం విరుపాక్షేశ్వర దేవస్థానం ప్రాంగణంలో పుట్టరాజ గవాయి వేదికపై అలమారి (సంచార జాతుల) కళా ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రి శ్రీరాములు మాట్లాడుతూ, అలమారి జాతులు నివాసానికి ఒక ప్రాంతం అంటూ లేదని,అటవీ ప్రాంతంలో నివాసం ఉంటూ సమాజంలోని వివిధ చోట్ల తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకుని వంశపార్యంపరంగా వచ్చిన వృత్తులను కొనసాగిస్తూ కొందరు జానపద కళలను ప్రజలకు ప్రదర్శనలు ఇచ్చి జీవనోపాధి నింపుకుంటున్నారు.
అలమారి జాతుల వారికి కళా ప్రదర్శన హంపి విరుపాక్ష స్వామి దేవస్థానం ప్రాంగణంలో వేదికను ఏర్పాటు చేయడంతో ఆ జాతుల కళా ప్రదర్శన ప్రజలకు ఇంపుగా ప్రజలకు ఇంపుగా నిలిచాయని అన్నారు. ఈ జాతుల వారు సామాజికంగా విద్య, ఆర్థికంగా, వెనుకబడి ఉన్నారు. వీరికి ప్రభుత్వం వీరిని అన్ని రకాలుగా ఆదుకునేందుకు కృషి చేస్తామని అన్నారు. ఈ జాతుల్లో సైనికులు, డాక్టర్లు, ఇంజనీయర్లుగా రాణించాలని ఆశిద్దామని అన్నారు.
అలమారి కళా బృందాలకు రూ 30వేలు మంజూరు చేసినట్లు ప్రకటించారు. ప్రభుత్వం నుంచి భాగ్యలక్ష్మి పథకం గాని, ఆరోగ్య శ్రీ సేవలు గాని వీరికి వర్థించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. తరువాత రాష్ట్ర పర్యాటక శాఖామంత్రి జనార్ధన్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హంపి ఉత్సవాల నిర్వహణకు నిధులను అధికంగా కేటాయించి ఉత్సవాలను ఘనంగా నిరవహించడం జరుగుతోందని అన్నారు. ఈ యేట హంపి ఉత్సవాలు రాష్ట్ర ప్రభుత్వం రూ. 10కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసిందని అన్నారు. తరువాత మాజీ మంత్రి రామచంద్ర గౌడ మాట్లాడుతూ, రామాయణం, భారతం, పౌరాణిక కథలు భావి పౌరులకు అందించేందుకు అలమారి జాతుల కథలు తోడ్పతాయని అన్నారు.
తరువాత హాస్పేట్ ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ మాట్లాడుతూ, అలమారి వర్గీయులను అన్ని రకాలా ఆదుకునేంందుకు జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించినట్లే, వారి అభివృద్ధికి సహకరించాలని అన్నారు. ఈ ఉత్సవాలు గత మూడేళ్ళ నుంచి అనూహ్యమైన రీతిలో నిర్వహించి ఉత్సవాల ఘనతను విశ్వవ్యాప్తంగా చాటుతున్నారు. అనంతరం కిన్నర జోగి హాస్పేట్ తాలూకా గొళ్ళారహళ్లికి చెందిన భాగ్యమ్మ కళా బృందం, జోగి కుణిత, అనంత శయన గుడికి చెందిన సుడిగాడు సిద్ధప్ప ఇంద్రజాల ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపి జె.శాంతి, ఎమ్మెల్యే టి.హెచ్. సురేష్‌బాబు, జిల్లా అధికారి బి.శివప్ప తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment